సర్పంచిగా గెలిచిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి

  • సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచిగా గెలిచిన రామచంద్రారెడ్డి
  • తన శేష జీవితం గ్రామానికి అంకితం చేస్తానని ఎన్నికల్లో ప్రచారం
  • లగచర్ల గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు విజయం
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఆయన సూర్యాపేట జిల్లాలోని నాగారం గ్రామ సర్పంచిగా బీఆర్ఎస్ మద్దతుదారుగా పోటీ చేశారు. 95 ఏళ్ల వయస్సులో ఆయన సర్పంచిగా గెలుపొందారు. తన శేష జీవితాన్ని గ్రామానికి అంకితం చేస్తానని, గతంలో తన కుటుంబం గ్రామానికి చేసిన సేవలను గుర్తుంచుకోవాలని ఆయన ఓటర్లను కోరారు.

వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు విజయం సాధించారు. వెంకట్రాములు గౌడ్ 15 ఓట్ల తేడాతో గెలుపొందారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు బేగరి పండరి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచిగా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ పుష్పలత ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చింతల్‌ఠాణా గ్రామంలో ఇటీవల మరణించిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి ఐదు రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. మరణించిన వ్యక్తికి అత్యధిక ఓట్లు రావడంతో ఫలితాన్ని ప్రకటించకుండా రిటర్నింగ్ అధికారి ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు.

Jagadish Reddy
Guntakandla Ramachandra Reddy
Telangana
Sarpanch Elections
BRS

More Telugu News